ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

30, జులై 2009, గురువారం

దద్ధ్యోదనం:

దద్ధ్యోదనం:
దద్ధ్యోదనం పెరుగు మరియు అన్నంతో చేసే రుచికరమైన ఆహారం. దీనిని వాడుకలో 'దద్ధోజనం' అనడం కూడా కద్దు.
కావలసిన పదార్ధాలు
బియ్యం - పావుకిలో
పెరుగు - అరలీటరు
పాలు - అరలీటరు
పచ్చిమిరపకాయలు - తగినన్ని
అల్లం - కొంచెం
కొత్తిమిర - కట్ట
కరివేపాకు - గుప్పెడు
నెయ్యి - చిన్న గిన్నెడు
పోపు సామానులు
జీడిపప్పు
పసుపు - చిటికెడు
తయారుచేయు విధానం
  • బియ్యం శుభ్రంగా బాగుచేసి, చక్కగా కడిగి, తరువాత 'అత్తెసరు' పెట్టాలి. అత్తెసరంటే గిన్నెలో బియ్యంపోసి తగినంత నీరు (అంటే వార్చకుండా అన్నం ఉడికేపాటి నీరు) పొయ్యాలి.
  • ఇలా ఉడికిన అన్నాన్ని ఒక కళాయి పళ్ళెంలోకి తిరగబోసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఆ అన్నం బాగా చల్లారేటట్లు విడిగా ఆరనివ్వాలి.
  • పాలు రెండు పొంగులు రానిచ్చి దించి, చల్లారనివ్వాలి. ఈ చల్లారిన పాలు పెరుగులో పోసెయ్యాలి.
  • పచ్చి మిరపకాయలు, అల్లం సన్నగ తరిగి ముక్కలుచేసి ఉంచుకోవాలి.
  • ఒక గిన్నెలోగాని, బూరెల మూకుడులోగాని నెయ్యివేసి, నెయ్యి మరిగాక జీడిపప్పు, రెండు ఎండు మిరపకాయలు, కాస్త మినప పప్పు వెయ్యాలి. ఈ రెండు కాస్త ఎర్రబడ్డాక, రెండు మెంతిగింజలు, కాసిని ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడుం వేసి చిటపటలాడాక, పచ్చిమిరప, అల్లం ముక్కలువేసి, కరివేపాకు దూసివేసి కాస్త వేగాక పోపుగిన్నెకిందికి దింపి ఆ పోపుని పాలు, పెరుగు పోసి బాగా కలపాలి.
  • పాలు, అన్నం బాగా చల్లారిన తరువాత బాగా చేతితో నాలుగువైపులా కలిసేటట్లు కలపండి.
  • చివరికి కొత్తిమిర తుంచి వేయండి.

చిట్కాలు

  • అన్నం వేడిగా ఉండగా కలిపినా, వేడిపాలలో పెరుగు కలిపినా పెరుగు విరిగిపోతుంది.